హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ ఈ నెలాఖరులోగా మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తొలి విడతగా ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేసింది. దీంతో దాదాపు మూడు లక్షల మంది రైతులు రూ.408 కోట్ల మేర లబ్ధిపొందారు. 2021-22 బడ్జెట్లో రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం రూ.2,006 కోట్లు కేటాయించింది. గత ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికే సగంమంది రుణాలు మాఫీ చేసింది. ఈ నెలాఖరులోగా మిగిలిన మిగిలిన రైతుల రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల నుంచి 75 వేల లోపు రుణాలను మాఫీ చేస్తుండటంతో మరో 5.38 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. రుణమాఫీ ప్రకటనతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.