హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఆదాయ పన్ను దాఖలు సమయాన్ని మరో నెల పొడిగించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్మలను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావుతోపాటు ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్ కలిశారు. ఆదాయ పన్ను గడువును పొడిగించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయని, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను దాఖలు చేయడానికి గడువును మరో నెల రోజులు పొడగించాలని కోరారు.