ఆర్కేపురం, జూన్ 17: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగినట్టు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మూడు రోజులపాటు జరిగిన సోదాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మొదటి రోజు గంటన్నరలోనే సోదాలు పూర్తయినా అధికారులు కావాలనే మూడు రోజులపాటు కాలయాపన చేశారని విమర్శించారు. పాతికేళ్లుగా తాను స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నానని, విదేశాల్లో మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. సోదాల సమయంలో ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించానని, విచారణ కోసం వారు ఎప్పుడు పిలిచినా వెళ్తానని పేర్కొన్నారు.