Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటీఐ బాలికల కళాశాల వద్ద కలెక్టర్ జీ రవి నాయక్, ఎస్పీ కే నరసింహ, ఇతర అధికారులతో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు.
సెయింట్ ఫౌండేషన్, శాంతానారాయణగౌడ్ చారిటుబల్ ట్రస్ట్ సంయుక్తంగా ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ల ఆధ్వర్యంలో వంద రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు సెంటర్ నిర్మాణానికి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్చి నెలలో నైపుణ శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు గురువారం కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోనే హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు. మహిళలకు నైపుణ్యాలను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆలోచన చేసిన సెయింట్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రద్యుమ్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీహితలను మంత్రి అభినందించారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో ఇప్పటికే 45 కోర్సుల్లో యువతకు శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు అండగా నిలిచామన్నారు.
మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు మహబూబ్నగర్ చేరుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారన్నారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్చార్జి కృష్ణ దీవి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ మహేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.