హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పగబట్టినట్టుగా, కక్ష పెంచుకొని వివక్ష ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ఏ పథకానికి నిధులు అడిగినా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. మెట్రో విస్తరణ కోసం నిధులు అడిగితే కనీస స్పందన లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెట్రోలకు మాత్రం నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీరు శత్రుదేశంపై పగబట్టినట్టుగా ఉన్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలపై పగబట్టడం ఎంతవరకు సబబో ప్రధాని, ఆయన ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెట్రోల విస్తరణకు అడిగినన్ని నిధులిస్తున్న కేంద్రం, హైదరాబాద్ మెట్రో కోసం ఎన్నిసార్లు అడిగినా పైసా ఇవ్వలేదని విమర్శించారు.
బెంగళూరు మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు ఇవ్వడమే కాకుండా అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా గ్యారంటీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘బెంగళూరు మెట్రో రెండో దశకు కేంద్రం రూ.11,866 కోట్లు కేటాయించింది. ఉత్తరప్రదేశ్లో ఆరు పట్టణాలకు మెట్రో నిధులు ఇచ్చారు. చన్నై మెట్రోకు కూడా నిధులు ఇచ్చారు. కానీ హైదరాబాద్ మెట్రో రెండో దశకు నిధులు ఇవ్వడంలేదు. బెంగళూరు మెట్రో నిర్మాణానికి రూ.59 వేల కోట్లు అంచనా వ్యయంకాగా, ఇందులో 20 శాతం అంటే రూ.11,866 కోట్లు కేంద్రం ఇచ్చింది. దానితోపాటు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా రూ.29,664 కోట్లకు గ్యారంటీ ఇచ్చింది.
చన్నై మెట్రో రెండో దశ అంచనా వ్యయం రూ.83,993 కోట్లు కాగా, కేంద్రం రూ.16,799 కోట్లు ఇచ్చింది. మిగిలిన మొత్తానికి అంటే రూ.41,996 కోట్ల రుణానికి గ్యారంటీ కూడా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో లక్నో, కాన్పూర్, గోరఖ్పూర్, ఆగ్రా, వారణాసి, ఆలహాబాద్ పట్టణాల మెట్రోలకు 20 శాతం చొప్పున నిధులు ఇచ్చి, గ్యారంటీ ఇచ్చింది. హైదరాబాద్కు మాత్రం సాయం చేయడంలేదు. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తుంది అన్నట్టుగా గుజరాత్లోని గాంధీనగర్కు 20 శాతం నిధులు, రుణ గ్యారంటీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ప్రతిపాదనలతో కేంద్ర అధికారుల వద్దకు వెళితే ప్రయాణికులు వస్తారా? వయబిలిటీ ఉంటుందా? అంటూ ప్రశ్నలు వేశారు’ అని మండిపడ్డారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతు న్న నగరంగా హైదరాబాద్ నిలిచిందని, దేశానికి ఎకనమిక్ ఇంజిన్గా ఉన్నప్పటికీ కేంద్రం మెట్రో విస్తరణకు సాయం చేయటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మూడేండ్లలో మెట్రో రెండోదశ
రాయదుర్గం నుంచి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31కిలోమీటర్ల మేర రూ.6,250 కోట్లతో మెట్రో రెండోదశను నిర్మిస్తున్నామని, ఇందులో కేంద్రప్రభుత్వం వాటా ఒక్క రూపాయి కూడా లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండోదశను రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్దీకపూల్ వరకు 26 కిలోమీటర్ల దూరం రూ.8,455 కోట్లను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే ఇంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడేండ్లలో మెట్రో రెండోదశను పూర్తిచేస్తామని చెప్పారు. నాగోల్ -ఎల్బీనగర్ మధ్య 5 కిలోమీటర్ల దూరం మెట్రో రెండో దశలో ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు.
మెట్రో ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించాలనేదానిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందని చెప్పారు. ఎల్అండ్టీ సంస్థ వాణిజ్య భవనాలు, భూముల ద్వారా 50 శాతం ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని, 45 శాతం ఆదాయాన్ని టిక్కెట్ల ఆమ్మకం ద్వారా, 5 శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ హయాంలోనే నిర్ణయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాత్రం మెట్రో ప్రకటనల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.‘రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రావడం కష్టం’ అని స్పష్టంచేశారు.
ఉత్తరప్రదేశ్లో ఆరు పట్టణాలకు మెట్రో నిధులు ఇచ్చారు. చన్నై మెట్రోకు కూడా నిధులు ఇచ్చారు. కానీ హైదరాబాద్ మెట్రో రెండో దశకు నిధులు ఇవ్వడంలేదు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా భోజనం వస్తుంది అన్నట్టుగా గుజరాత్లోని గాంధీనగర్కు 20 శాతం నిధులు, రుణ గ్యారంటీ ఇచ్చారు. హైదరాబాద్కు మాత్రం సాయం చేయడంలేదు.
-మంత్రి కేటీఆర్