KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, 15 (నమస్తే తెలంగాణ): యువత సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని, స్టార్టప్ అనేది ఒరిజినల్గా ఉన్నప్పుడే వారిని విజయం వరిస్తుందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ స్టార్టప్ చాలెంజ్ ముగింపు సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒరిజినల్ స్టార్టప్లతో వచ్చే వారు హైదరాబాద్లోని ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సరికొత్త ఆలోచనలతో స్టార్టప్ పెట్టే సత్తా ఉంటే పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తారని, ‘ప్రాఫిట్ విత్ పర్పస్’ను విజయానికి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల శ్రేయస్సుకు ఆవిషరణ, వ్యవస్థాపకత చాలా కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు మంత్రి నాలుగు ముఖ్యమైన సూచనలు చేశారు. ఏదైన ఆలోచన అనేది ఒరిజినల్గా ఉండాలని, ఫెయిల్యూర్ను సైతం సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఎల్వీపీఈఐ నిర్వహించిన స్టార్టప్ చాలెంజ్లో 42 మంది పాల్గొనగా ఇందులో ముగ్గురు మాత్రమే విజేతలుగా నిలిచారని, మిగిలిన 39 మంది వైఫల్యం చెందినట్టు భావించకూడదని పేర్కొన్నారు. వారు మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కనుగోవాలని, హైదరాబాద్లో ఉన్న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్తో పాటు టీ హబ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యరంగంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన, పరిశోధన కేంద్రం ప్రపంచ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన టాప్-10 ఆరోగ్య, పరిశోధనా కేంద్రాల్లో ఎల్వీపీఈఐ చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు.
సరికొత్త ఆవిష్కరణలతో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందచేశారు. ఇందులో మణిపాల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ గిరీశ్ సోము వంశీకి ఆప్టికల్ కొహెరెన్స్ టొమోగ్రఫిలో నూతన ఆవిష్కరణ కనుగొన్నందుకు రూ.5 లక్షల బహుమతిని చెక్ రూపంలో ఎల్వీపీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుతో కలిసి అందజేశారు. వర్చువల్ రియాలిటీకి సంబంధించిన ఆవిష్కరణలో రెండో విజేత బెంగళూరుకు చెందిన డాక్టర్ రమేశ్కు రూ.3 లక్షల చెక్ను, మూడో విజేత హైదరాబాద్కు చెందిన డాక్టర్ రవికిరణ్కు రూ.2 లక్షల చెక్ను అందజేశారు. ఎల్వీపీఈఐ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, రిచ్-హైదరాబాద్ డీజీ అజిత్ రంగ్నేకర్, ఎం. శ్రీనివాస్రావు పాల్గొన్నారు.