హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ): ‘నేను ఎయిర్పోర్టు నుంచి వస్తుంటే.. హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఇండియాలోనే ఉన్నానా? లేక ఏదైనా ఫారెన్ కంట్రీలో ఉన్నానా? అని ఆశ్చర్యం కలిగింది. రాష్ర్టాన్ని పాలించిన గత పాలకులకే ఈ ఘనత దక్కుతుంది. వారితోపాటు ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లకు కూడా ఈ గౌరవం దక్కుతుంది’ అని ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ చైర్మన్ రాధాకృష్ణ కొనియాడారు.
హైటెక్స్లో నిర్వహించిన 31వ ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ, 1989లో 13 ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ను హైదరాబాద్లో నిర్వహించగా, ఇప్పుడు 31వ కన్వెన్షన్ను ఇక్కడే నిర్వహించుకుంటున్నామని, ఈ మధ్యకాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ర్టాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని ప్రశంసించారు. తమ కన్వెన్షన్ కోసం హైదరాబాద్ను ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని వెల్లడించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ దేశాభివృద్ధికి పునాదులు వేయగా, పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలతో దేశం పురోగమిస్తున్నదని, సూపర్ పవర్గా ఎదుగుతున్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో మున్సిపల్శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చొరవతో నేడు హైదరాబాద్ రోడ్లు గుంతలు లేకుండా ఉన్నాయని ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శీనయ్య ప్రశంసించారు. ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో రోడ్లు గుంతలు లేకుండా ఉండాలంటే తాము ఇచ్చే కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రకారం రోడ్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యత కనీసం ఐదేండ్ల పాటు తమకు అప్పగించాలని కోరినట్టు చెప్పారు.
దీనికి అప్పటి మంత్రి కేటీఆర్ వెంటనే ఒప్పుకొని, హైదరాబాద్లో రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని స్పష్టంచేసినట్టు గుర్తుచేశారు. మరో పదేండ్ల పాటు హైదరాబాద్ రోడ్లను ముట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో ఏటా రోడ్ల మరమ్మతులకు రూ.200 కోట్లు ఖర్చుచేసేవారని, అయినా వర్షం పడగానే రోడ్లన్నీ కొట్టుకుపోయేవని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఓ వర్క్షాప్ నిర్వహించాలని కోరారు.