Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.10 కోట్లు పుచ్చుకున్నారా? ఐదెకరాల భూమిని రాయించుకున్నారా? ‘ఓటుకు నో టు’ వ్యవహారం లాగే ‘సీటుకు నోటు’ వ్యవహారం నడుపుతున్నారా? ఇప్పుడు కాంగ్రెస్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గంలోనే కాకుండా ఢిల్లీలో మకాం వేసిన కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు వీ హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా తమను వాకబు చేశారని నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఏకంగా మీడియా సమావేశంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం. మహేశ్వరం టికెట్ కోసం ఐదుగురు నేతలు గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు.
టికెట్ తమకే వచ్చిందంటూ బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి సోషల్మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఇతర నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, నియోజకవర్గ నాయకులు దేప భాస్కర్రెడ్డి, కొత్త మనోహర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి ఎలిమినేటి అమరేందర్రెడ్డి తదితరులు సోమవారం మీడి యా సమావేశం నిర్వహించారు. మహేశ్వరం టికెట్ తమకే వచ్చిందంటూ ఒక నేత చేసుకుంటున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మహేశ్వరం టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడికి ఐదెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేశారు.. రూ.పది కోట్లు ఇచ్చారు.. అనే ప్రచారం జరుగుతున్నది.. నిజమా?’ అని వీహెచ్ లాంటి సీనియర్ నేతలే తమను వాకబు చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని తామంతా అడిగితే ఇంకా తెలంగాణలో ఎవరికీ టికెట్లు ఖరారు చేయలేదని తమతో చెప్పారని ఆ నేతలు పేర్కొన్నారు.