ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30: రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తమ ప్రత్యర్థులు కొంతమంది తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను గత మూడు పర్యాయాలుగా వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందానని, తనపై ఓడిపోయిన ప్రత్యర్థులు జీర్ణించుకోలేక 2018లో ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు చేశారని విమర్శించారు.
ఆ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ తేల్చకపోవటంతో ఈడీకి తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును ఢిల్లీ ఈడీ హైదరాబాద్కు బదిలీ చేసిందని వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై గతంలోనే తనకు నోటీసులు ఇవ్వగా తాను వివరణ కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఆ వివరణపై సంతృప్తి చెందని ఈడీ అధికారులు మరోమారు విచారణకు పిలిచారని తెలిపారు. తాను బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టానన్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. 2014లో నలుగురు మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లానని, వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్లో డబ్బులు తీసుకున్నా ఫెమా పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారని చెప్పారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పానని తెలిపారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. తానే ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఒప్పుకొన్నారని తెలిపారు.