హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయని బీజేపీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ విమర్శించారు. కేంద్రమంత్రి అమిత్షా అబద్ధాల, దివాళాకోరుతనానికి బీసీ సీఎం ప్రకటనే నిదర్శమని మండిపడ్డారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత స్పష్టంగా ఉన్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, బీసీ కులగణన చేపట్టాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా స్పందించని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో బీసీ జపం చేయడం విడ్డూరమన్నారు. బీజేపీ ప్రకటనను బీసీలెవరూ నమ్మబోరని పేర్కొన్నారు.