హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) వనస్థలిపురం: ట్యురిటో జూనియర్ కళాశాల అంటూ బోర్డు పెట్టారు.. జేఈఈ, నీట్ క్లాసులు కూడా చెబుతామంటూ గొప్పలు పలికారు.. గత విద్యా సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు చేరారు. కొన్ని నెలలు గడిచాయో, లేదో బోర్డు తిప్పేశారు. ట్యురిటో జూనియర్ కళాశాల కాస్తా ట్యురిటో క్లాసెస్గా మారింది. ఇదేంటని తల్లిదండ్రులు మంగళవారం మూకుమ్మడిగా వెళ్లి ప్రిన్సిపాల్ను ప్రశ్నిస్తే.. ‘ఇదంతా కామనే’ అంటూ ఆయన చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. వనస్థలిపురం ప్రశాంత్నగర్లో నిరుడు ట్యురిటో జూనియర్ కళాశాల పేరిట ఒక భవనంలో కళాశాలను ఏర్పాటు చేశారు.
చుట్టుపక్కల ఉన్న వారు తమకు కళాశాల దగ్గర అవుతుందనే భావనతో అందులో చేరారు. అనుమానం వచ్చి కొందరు అనుమతి గురించి ప్రశ్నిస్తే త్వరలోనే వస్తుందంటూ యాజమాన్యం నమ్మబలికింది. కొంతకాలం తర్వాత కళాశాల బోర్డును క్లాసెస్గా మార్చారు. ఫీజు చెల్లించిన వారికి వెస్ట్ మారేడుపల్లిలోని ఎక్సెల్ కళాశాల పేరిట రశీదులు ఇచ్చారు. మరికొందరికి ట్యురిటో ఇండి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రశీదులు ఇచ్చారు. దీని చిరునామా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, ప్లాట్ నంబరు 773గా ఉంది. మొదటి సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు హాల్టికెట్లు బాలాపూర్ మండలం మల్లాపూర్లోని యవతరంగ్ జూనియర్ కళాశాల పేరిట వచ్చాయి. వాటిని చూసి కొందరు తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను అడగ్గా వారికి ఏదో ఒక సమాధానం చెప్పి నెట్టుకొచ్చారు.
కళాశాల పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ రెండో సంవత్సరం అంటే 2023-24 విద్యా సంవత్సరానికి కూడా పదుల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకున్నారు. ప్రస్తుతం కాలేజీలో 140 మంది వరకు విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు లెక్చరర్లతోనే మధ్యాహ్నం 12 వరకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల లాంగ్వేజెస్కు సంబంధించి ప్రత్యేకంగా లెక్చరర్లను పిలిపించి మూడు రోజుల్లోనే మొత్తం సిలబస్ పూర్తి చేసినట్టు విద్యార్థులు తెలిపారు. ఒకవైపు పరీక్షలు సమీపిస్తుండటం, సిలబస్ పూర్తికాకపోవడంతో పాటు ల్యాబ్కూడా లేకపోవడంతో ప్రాక్టికల్స్ పరిస్థితి ఏంటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ తతంగంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రిన్సిపాల్ స్వామిని వివరణ కోరగా, లోకంలో జరుగుతున్నదే తామూ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై రంగారెడ్డి ఆర్ఐఈఓ వెంకయ్య నాయక్ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా ఇప్పటివరకు తమ దృష్టికి ఈ విషయం రాలేదని వివరాలు తీసుకున్నారు. దీనిపై విచారణ చేస్తానని స్పష్టం చేశారు.