Telangana CM | హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. సీఎం సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. పలువురు సీనియర్ నేతలు ఎప్పటి నుంచో తామూ సీఎం రేసులో ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రేసులో ఉన్నట్టు చెప్పుకొన్నారు. దీంతో వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై అధిష్ఠానం చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఆశావహులతో పాటు ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాతే సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
సీఎల్పీ నేత ఎంపికపై కసరత్తు
సీఎం ఎంపికపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారథ్యంలో పార్టీ కసరత్తును వేగవంతం చేసింది. ముందుగా సీఎల్పీ నేత ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్లోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నది. శనివారం నుంచి ఇక్కడే మకాం వేసిన డీకే శివకుమార్… గెలిచిన ఎమ్మెల్యేలను హోటల్కు రావాలని కోరారు. దీంతో రాత్రికే పలువురు ఎమ్మెల్యేలు హోటల్కు చేరుకున్నారు. ఈ సమావేశంలో సీఎంగా ఎవర్ని ఎంపిక చేయాలనేదానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానం తీసుకున్నది. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా సోమవారం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నది.
రేవంత్ సీఎం.. కొట్టిపారేసిన ఉత్తమ్
రేవంత్రెడ్డే సీఎం అంటూ ఇటు పార్టీలో అటు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఇందుకు అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేసులో ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఖండించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు సీఎం ఎవరనేదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏఐసీసీలో దీనిపై ఎలాంటి నిర్ణయం జరగలేదని తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశం తర్వాతే స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే సీఎం ఎవరనేదానిపై తన అభిప్రాయాన్ని ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
రాజ్భవన్కు కాంగ్రెస్ నేతలు
సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆదివారం రాత్రి ఠాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరింది. అంతకు ముందు డీకే మీడియాతో మాట్లాడుతూ… సీఎల్పీ నేత ఎంపిక కోసం సోమవారం ఉదయం 9.30కు సీఎల్పీ భేటీ నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. తొలుత ఎలాంటి హడావిడి లేకుండా రాజ్భవన్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.