న్యూఢిల్లీ, జూలై 5 (నమస్తే తెలంగాణ): తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించడంతో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అలక వహించినట్టు తెలుస్తున్నది. అధిష్ఠానం నిర్ణయంపై కిషన్రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కిషన్రెడ్డి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, మోకాలు నొప్పిని కారణంగా చూపి బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీకి హాజరుకాకపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఆయన స్పందన కోరేందుకు పడిగాపులు కాసిన మీడియాతోనూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కనీసం సోషల్మీడియాలో కూడా స్పందించకపోవడంపై సర్వత్రా ఆశ్చ ర్యం వ్యక్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం కన్నా కేంద్ర మంత్రిగా కొనసాగడమే మంచిదన్న అభిప్రాయానికి కిషన్రెడ్డి వచ్చారని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారా? లేదా అన్నది మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన లేఖను ప్రధాన కార్యాలయానికి అందజేసినట్టు ప్రచా రం జరుగుతున్నది. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం మీడియాతో మా ట్లాడిన కిషన్రెడ్డి.. రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని అధిష్ఠానాన్ని ఏనాడూ అడుగలేదని, పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పడం గమనార్హం.