నిర్మల్, జనవరి 9 : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే నల్లా చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారని మంత్రి అన్నారు. ఆదివారం జిల్లాలోని దిలావర్ పూర్, సోన్ మండల కేంద్రాల్లో రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రి ర్యాలీలో పాల్గొని ట్రాక్టర్ నడిపారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ..మాయమాటలు చెబుతూ మోదీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. అన్నదాతలకు అండగా ఉండి బాధ్యతగా పంటను కొనాల్సిన కేంద్ర కాడి ఎత్తేస్తుందన్నారు. తెలంగాణ రైతన్నలపై బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలతో కుట్రలను చేస్తుందని మండిపడ్డారు.
ఇక ఈ మధ్య జాతీయ బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చి ఏదేదో మాట్లాడుతన్నారన్నారు. ఓ వైపు వరి ధాన్యం కొనమని చెబుతూ..మరో పక్క వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీజేపీ నేతల తీరును తప్పు పట్టారు. బీజేపీ చెప్పే అబద్ధాలను నమ్మి మోసపోవద్దని రైతులను కోరారు.