సూర్యాపేట : వరంగల్లో జరిగేది రైతు సంఘర్షణ సభ ఎంత మాత్రం కాదని, అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాంపియన్ ఎవరు అన్నది తేల్చుకోవడానికి నిర్వహిస్తున్న నాయకత్వ సంఘర్షణ సభ అని విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అంతర్గత కుమ్ములాటల నుంచి బయట పడడానికి నిర్వహిస్తున్న సభగా ఆయన అభివర్ణించారు. ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరింలేని హీన స్థితిలో ఆ పార్టీ చేరుకుందన్నారు. ఎండ్ర గిచ్చల గుంపు నుంచి బయట పడేందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
కొంగజపాలకు ఇక్కడి ప్రజలు ఎవరూ మోసపోరని, తెలంగాణా రైతాంగ ,ఇక్కడి యువత చైతన్యవంతులని ఆయన పేర్కొన్నారు. యువత మీద ఆ పార్టీకి కొద్దో గొప్పో ఆశ ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల నియామకాల నోటిఫికేషన్ లతో అది పూర్తిగా ఆవిరి అయిపోయిందన్నారు.
దిక్కు తోచకనే ఉస్మానియా యూనివర్సిటీలో అలజడి సృష్టించేందుకు ఆ పార్టీ కుట్రలకు తెర లేపుతుందన్నారు. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, విద్యాధికులు సైతం టీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారని మంత్రి తెలిపారు.