హైదరాబాద్ : విశాఖ ఉక్కు(Vizag Steel)ను కాపాడేది, పోలవరం(Polavaram)ను పూర్తిచేసే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. తెలంగాణ కార్మికశాఖ ఆధ్వర్యంలో మే డే(May Day celebrations) వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) తరహాలో పరిపాలన చేయడం ఎవరి వల్లా కాదని, యావత్తు దేశం కేసీఆర్ వైపు చూస్తోందని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్(BRS)సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించారు. ఆంధ్రా ప్రజలను పట్టించుకునేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. 2024లో దేశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే లీడ్ చేస్తుందని పునరుద్ఘాటించారు.
మంత్రి కేటీఆర్ పారిశ్రామిక ప్రగతి(Industrial Development)పై తీసుకుంటున్న చర్యల వల్ల హైదరాబాద్ దేశంలోని 15 రాష్ట్రాల కార్మికులకు బతుకుదెరువునిస్తోందన్నారు. ‘హైదరాబాద్ ముందు అమెరికా(America) పాతగైంది. బొంబాయి, బెంగళూరు వెనుకబడిపోయాయి. నేడు ఒకే ఒక్క హైదరాబాద్ కళకళలాడుతున్నదని’ స్పష్టం చేశారు. కార్మికుల పనితనంతోనే రాష్ట్రం అద్భుతంగా మారిందన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో రూ. 1800కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposits) నిధులున్నాయని, ఈ నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తామని మంత్రి వెల్లడించారు.
భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు, కార్మికుల పిల్లలకు కేవీ స్కూళ్ల తరహాలో ప్రత్యేకంగా స్కూళ్లు, హాస్పిటళ్లు, కార్మిక భవనాల నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మేడే ఉత్సవాల సందర్భంగా 60 మందికి శ్రమశక్తి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాణి కుముదిని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమబోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, కార్మికశాఖాధికారులు గంగాధర్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.