హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): టీఎస్ఎప్పీఆర్బీ ద్వారా చేపడుతున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం.
తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 26 వరకు 11 పనిదినాల్లో 1,08,940 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం 97,175 మందిని ప్రొవిజనల్ సెలక్షన్కు ఎంపిక చేశారు. వీరిలో అర్హతలు, రిజర్వేషన్ను బట్టి తుది జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని, ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కోరారు.