Teachers : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలని నిన్నటి నుంచి వార్తలు వినిపించాయి. ఈ వార్త ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఆయోమయానికి దారితీసింది. ఇది నిజంగా విద్యాశాఖ ఆదేశమా.. లేదంటే ఒట్టి పుకారేనా అనేది వాళ్లు తేల్చకోలేకపోయారు. ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దాంతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్కు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా పదోన్నతి పొందాలంటే టెట్లో క్వాలిఫై కావడం తప్పనిసరి అయ్యింది. కాబట్టి ఉపాధ్యాయ ఉద్యోగార్థులతో పాటు ప్రభుత్వ టీచర్లు సైతం పదోన్నతుల కోసం టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది.
కాగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి. సందేహాల నివృత్తికి అభ్యర్థులు 70757 01768, 70757 01784 నంబర్లను సంప్రదించవచ్చు.