హైదరాబాద్ : వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రకృతిని, భావితరాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేబీఆర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కను నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పారదోలేందుకు మొక్కలు నాటడం, నాటించడం, వాటిని పరిరక్షించడం అత్యవసరమని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్ ఇప్పటివరకు 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమని కొనియాడారు.
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలను నాటించడం, వాటిని పరిరక్షించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేశ్ నాయుడు,మున్నూరుకాపు ప్రముఖులు కొండా దేవయ్య, సర్దార్ పుట్టం పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు,అటవీ శాఖ సిబ్బంది ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.