BJP | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ): తెలంగాణలో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు లేరంటూ జరుగుతున్న ప్రచారం నిజమేనని తేలిపోయింది. శుక్రవారం ఆ పార్టీ ఒకే ఒక్కరితో రెండో జాబితా ప్రకటించి ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి కుమారుడు మిథున్రెడ్డిని మహబూబ్నగర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేయడంపై నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
ఒక్కడి పేరుతో ప్రత్యేక జాబితా ఏంటంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తన కొడుకు కోసం మోదీ, అమిత్ షాను జితేందర్రెడ్డి అంత ప్రభావం చేయగలిగారా? అని కొత్త చర్చ లేవనెత్తారు. ఏది ఏమైనా కుమారుడికి సీటు ఇప్పించుకోవడం ద్వారా జితేందర్రెడ్డి తన పుత్ర ప్రేమను చాటుకున్నారని కొందరు అంటుంటే, డబ్బు, పలుకుబడి ఉంటే అవకాశాలు ఇలానే వస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఎదురుచూస్తే లిస్టులన్నీ ఒక్కొక్కరితోనే విడుదల చేసుకోవాల్సి వస్తుందని బీజేపీని ఎద్దేవా చేస్తున్నారు.