హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు. కేసీఆర్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు తెలంగాణ అభివృద్ధి నిదర్శనమని కొనియాడారు. మహేశ్ అధ్యక్షతన బీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంలో కొలంబస్లో జాతీయ సదస్సు నిర్వహించారు. 50 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అమెరికాలో బీఆర్ఎస్ విభాగం ఏర్పాటైన తర్వాత అక్కడ నిర్వహించిన తొలి జాతీయ సదస్సు ఇదే. అటార్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షుడు అరిందమ్ గుహ, బ్లూ యాష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ ఝవేరి అతిథులుగా హాజరయ్యారు. బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్లు పూర్ణ బైరి, చందు తాళ్ల వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టారు. మహేశ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సంసరణలు, రైతుబంధు అమలు చూసి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్ సమర్థ నాయకత్వం వల్ల ఐటీ రంగంలో 2.50లక్షల కోట్ల ఎగుమతులు చేయగలిగినట్టు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ యూఎస్ఏ పాత్ర కీలకమన్నారు. బీఆర్ఎస్ యూఎస్ఏను అమెరికాలోని అన్ని రాష్ర్టాల్లోనూ బలోపేతం చేయాలని, సమావేశాలకు ఎన్నారైలను ఆహ్వానించాలని, తెలంగాణ మాడల్ వీడియోలను భారత్లోని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. సదస్సులో కేసీఆర్ కటౌట్, కార్ ర్యాలీ ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూఎస్ఏ కార్యదర్శులు నరసింహ నాగులవంచ, అరవింద్ తకళ్లపల్లి పాల్గొన్నారు.