హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): అది 44వ నెంబర్ జాతీయ రహదారి. హైదరాబాద్- షాద్నగర్ మార్గం. ఆ దారిలో ఏ ఒక్క ద్విచక్ర వాహనదారుడూ హెల్మెట్ ధరించకుండా రోడ్డెక్కడు! ఆ చుట్టుపక్కల 9 మండలాలు, 30కి పైగా గ్రామాలవారు హెల్మెట్ లేకుండా బయటకు రారు. ఇందుకు కారణం షాద్నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్, ఆయన బృందం చేసిన కృషి. దేశంలో ఎక్కడాలేని విధంగా జాతీయరహదారిపై ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేసేందుకు రాయికల్ టోల్ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటుచేశారు. హెల్మెట్ లేకపోతే ఇతర ప్రాంతాల్లో మాదిరిగా అక్కడ ఎటువంటి ఫైన్ వేయరు! హెల్మెట్ లేనివారిని బైక్ మీద నుంచి దింపి బస్సు ఎక్కిస్తారు. లేదంటే హెల్మెట్ తెచ్చుకొంటేనే ప్రయాణానికి అనుమతిస్తారు.
ఇలా రెండున్నరేండ్లలో కనీసం 10,000 మందితో హెల్మెట్ కొనిపించడం విశేషం. డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్ గురించి వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే తీరును కండ్లకు కట్టేలా చిత్రీకరించి, ఆ వీడియోలను వాట్సాప్ గ్రూప్ల్లో షేర్ చేస్తున్నారు. ఇలా దాదాపు 100 వీడియోలు రూపొందించడం విశేషం.భారీ డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించిన రఘుకుమార్ సుమారు నాలుగు వేల మంది లర్నింగ్ లైసెన్స్ పొందేందుకు సహాయపడ్డారు. ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజూ దాదాపు 60వేల వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉండటానికి రఘుకుమార్ అండ్ టీం చేసిన కృషి కారణం. వీరి కార్యక్రమాలకు తెలంగాణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది.