సంగారెడ్డి, మే 1(నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు మొదలయ్యాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి మున్సిపల్ వైస్చైర్మన్ లతా విజయేందర్రెడ్డి నివాసంలో బుధవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెండు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు.. లతా విజయేందర్రెడ్డి నివాసం, ఆమె భర్త విజయేందర్రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగాయి. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన విజయేందర్రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. విజయేందర్రెడ్డి భార్య లతా విజయేందర్రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి మున్సిపల్ వైస్చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లతా, విజయేందర్రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్లో కీలకంగా పనిచేస్తున్నారు. విజయేందర్రెడ్డి దంపతులను పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విజయేందర్రెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది మింగుడు పడని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు బుధవారం దాడులు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమైందని, ఓటమి భయంతోనే బీజేపీ ఐటీ దాడులకు పాల్పడుతున్నదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి మున్సిపల్ వైస్చైర్మన్ లతా విజయేందర్రెడ్డిపై ఐటీదాడులను వారు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ ఐటీ శాఖను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు.