Telangana | హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): పెరిగిన అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని 14 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం పట్టించుకోకపోవడంతో వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రస్తావన కూడా రాలే
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారంలోనే ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన రోడ్లతోపాటు పెండింగ్లో ఉన్న 14 రోడ్ల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా వాటికి జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఆయన సరేనని గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు, ఆర్అండ్బీ శాఖ బడ్జెట్పై గత శనివారం ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చర్చించినప్పటికీ ఈ రోడ్ల ప్రస్తావన మాత్రం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే కేంద్రం ఈ రోడ్లకు జాతీయ హోదా ఇచ్చే వరకు వాటి అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ 14 రోడ్లను కలుపుతూ దాదాపు 1,656 కిలోమీటర్ల పొడవునా రోడ్లు అభివృద్ధి చేయాలని ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.