హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 1 నుంచి హరితనిధి అమలుకానున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అంతర్గత ఉత్తర్వుల జారీపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఉద్యోగులు మే నెలలో అందుకోబోయే వేతనం నుంచి నిర్దిష్ట మొత్తాన్ని హరితనిధికి జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చే విరాళాలు, ప్రభుత్వం విధించే పన్నులు, ఫీజుల రూపంలో హరితనిధి సమకూరుతుంది. హరితనిధి విధివిధానాలపై గత డిసెంబర్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
హరితనిధి వినియోగానికి అటవీశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. అటవీ, పర్యావరణశాఖల మంత్రి చైర్మన్గా వ్యవహరించే హరితనిధి రాష్ట్ర కమిటీలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్గా, పీసీసీఎఫ్ కన్వీనర్గా, పీసీసీఎఫ్ కంపా, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ, ఆర్థికశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. హరితనిధికి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. నర్సీరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, సంరక్షించడం, మొక్కల లెక్కలు తేల్చడం, పచ్చదనంపై అవగాహన పెంచే కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ వంటి అవసరాలకు ఈ నిధిని ఉపయోగించాలని జీవోలో పేర్కొన్నారు.