Aditya L1 | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్ను శనివారం సాయంత్రం 4 గంటలకు లాగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెడుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో శుక్రవారం నిర్వహించిన 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్కు జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 విజయవంతంగా దూసుకుపోతున్నదని పేర్కొన్నారు.
ఈ నెల లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వాతావరణానికి సంబంధించిన ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నట్టు వెల్లడించారు. గగన్యాన్ ప్రయోగం కోసం కూడా సన్నాహాలు కొనసాగుతున్నాయని, 2024 గగన్యాన్ సంవత్సరం కాబోతుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో విజయాల నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమే భారత్ వైపు చూస్తున్నదని సోమ్నాథ్ అన్నారు. జీవితంలో అపజయాలు, ఒడిదొడుకులు సహజమని, అపజయాల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. నేటికాలం ఆలోచనలకు అనుగుణంగా యూనివర్సిటీల్లో కూడా కొత్త కోర్సులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూకు టెక్నాలజీ సాయం అందించడంలో ఇస్రో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్తో కలిసి వీసీ నరసింహారెడ్డి, ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దాదాపు 88,226 మందికి పట్టాలు ప్రదానం చేశారు. యూజీ, పీజీ, పీహెచ్డీలలో 54 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. 142 మందికి పీహెచ్డీ పట్టాలు అందచేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరు కాలేదు. అయితే ఆమె మొబైల్ సందేశం ద్వారా విద్యార్థులకు అభినందనలు తెలిపారు.