హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): నేడు ఆంధ్రప్రదేశ్లో ఐసెట్, ఈసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈసెట్-2024 ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు అనంతపురం -జేఎన్టీయూలో విడుదల చేయనున్నట్టు ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి వెల్లడించారు. మే 8న ఏపీ ఈసెట్ పరీక్షలు నిర్వహించగా, 36,369మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2024 ఫలితాలను గురువారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ఐసెట్ కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, 44,446 మంది హాజరయ్యారు.