హైదరాబాద్ : ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థ అయిన హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ISB) దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం విడుదలైన పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ -2023లో దేశంలోనే అగ్రస్థానాన్ని నిలుపుకున్నది. రీసెర్చ్ ర్యాంకింగ్స్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన సంస్థ, ప్రపంచవ్యాప్తంగా 39వ ర్యాంక్, ఆసియాలో ఆరో ర్యాంకు సొంతం చేసుకున్నది. ఈ సంవత్సరం టాప్ 50లో చేరిన ఏకైక భారతీయ బీ-స్కూల్గా కీర్తికెక్కింది. ఈ జాబితాలో కొలంబియా బిజినెస్ స్కూల్ (US), ఇన్సీడ్ (ఫ్రాన్స్/సింగపూర్), ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్ (స్పెయిన్), హార్వార్డ్ బిజినెస్ స్కూల్ (US), స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (US)లు వరుసగా టాప్ -5 బిజినెస్ స్కూల్స్లో జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఐఎస్బీ రీసెర్చ్ రంగంలో దేశంలోనే అగ్రశ్రేణి బీస్కూల్గా నిలువగా, ప్రపంచ రీసెర్చ్ ర్యాంకింగ్స్లో 61వ స్థానంలో నిలిచింది. 2019లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) కోర్సు పూర్తిచేసిన పూర్వ విద్యార్థులపై సర్వేను నిర్వహించారు. వార్షిక వేతన పెరుగుదల రేటు, కెరియర్, అలుమ్ని నెట్వర్క్ తదితర రంగాల్లో సర్వే జరిగింది. ఇందులో ఐఎస్బీ ఉత్తమ పనితీరును కనబరిచింది. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై మాట్లాడుతూ ఐఎస్బీ అగ్రశ్రేణి బీ స్కూల్గా స్థిరమైన ప్రదర్శనను కొనసాగించడం, తమ నిరంతర ప్రయత్నాలకు నిదర్శనమన్నారు. అత్యాధునిక బోధనా పద్ధతులు, ఆయా రంగాల్లో ఉన్నతంగా ఆలోచించే అధ్యాపక నాయకత్వం ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.