హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన కుమార్తె భవతారిణి (47) గురువారం శ్రీలంకలో కన్నుమూసింది. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచింది. 1995లో ప్రభుదేవా నటించిన రసయ్య అనే తమిళ చిత్రంలో పెప్పి మస్తానా.. మస్తానా.. అనే పాట ద్వారా తెరంగేట్రం చేసిన భవతారిణి వందలాది పాటలు పాడారు.
ఆమె సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా తరహాలోనే తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భవతారిణి సంగీత దర్శకురాలిగా, గాయనిగా పేరు తెచ్చుకున్నారు. తమిళంతోపాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో అనేక పాటలు పాడింది. ఆమె భర్త వ్యాపారవేత్త అయిన శబరిరాజ్. తెలుగులో ఆమె పాడిన ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ (గుండెల్లో గోదారి) పాట సంగీత ప్రియులను మెప్పించింది. ఫ్రెండ్స్, పా, టైమ్, ఒరు నాళ్ ఒరు కనవు, అనెగన్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. ఫిర్ మిలెంగే, ఇలక్కనమ్, వెల్లాచి తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భారతి చిత్రంలోని ‘మయిల్ పోలా పొన్ను పొన్ను ఒన్ను’ పాటకుగాను భవతారిణి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తన తండ్రి, సోదరులు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లోనే ఆమె ఎక్కువ పాటలు పాడారు. భవతారిణి అంత్యక్రియలను శనివారం చెన్నైలో నిర్వహించనున్నారని సమాచారం.