KTR | మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇదేనా మీ మొహబ్బత్కీ దుకాణ్ అని ప్రశ్నించారు. తెల్లవారుజాము సమయంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల గొంతును వినిపించడమే వారు చేసిన నేరమా అని నిలదీశారు. రోజూ మీరు వల్లెవస్తున్న భారత రాజ్యాంగం కూడా వాక్ స్వాతంత్య్రాన్ని సమర్థిస్తూనే ఉందని గుర్తుచేశారు.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని విమర్శించారు. రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వీ యాదవ్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిర్బంధ పాలనకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా , సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.