హుజూరాబాద్, సెప్టెంబర్ 4: ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కో మంత్రికి నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. అందరి నియోజక వర్గాల్లో మంచిగా ఇండ్లు కట్టి పేదోళ్లకు ఇచ్చాం. అప్పుడు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఒకటి కూడా పూర్తి చేయలేదు. ఎందుకు కట్టలేదని అడిగితే ఆయనకు మస్తు కోపం వస్తుంది. ఏడేండ్ల పదవిలో ఒక ఇల్లు ఎందుకు కట్టలేదని అడగడం తప్పా?.. ఈ మాట అడిగితే నన్ను తిట్టడం న్యాయమా?.. ఒక మహిళా సంఘ భవనం ఎందుకు నిర్మించలేదని అడిగా… ఇవడిగితే.. నన్ను నానా మాటలనడం ధర్మమా..? నాపై లేనిపోని నిందలు వేస్తూ అనరాని మాటలు అంటున్నడు. అభివృద్ధి బాధ్యత ఇప్పుడు నేను తీసుకుంటానని చెప్పడం తప్పా?.. ఇందులో ఏమన్నా బూతుపదాలున్న యా?.. అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఉలికిపడుతున్నడు’ అంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై మండిపడ్డారు. ఆయనకు ఓట్ల యావే తప్ప ప్రజల యోగక్షేమాలు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానుభూతి కోసం మాట్లాడే వారిని నమ్మవద్దని, నరం లేని నాలుక ఎైట్లెనా మాట్లాడుతుందని, మహిళలు బొట్టు బిల్లకు.. రూ.60 గోడ గడియారానికి ఆగం కావొద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని బీఎస్సార్ గార్డెన్లో మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణం చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ఓటు వేసి టీఆర్ఎస్కు అండగా ఉంటే అభివృద్ధి, ఇతరత్రా పనుల జిమ్మేదారు తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 150 మంది హుజూరాబాద్లోని బీఎస్సార్ గార్డెన్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాగా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్హౌస్లో వీణవంక మండలం దేశాయిపల్లికి చెందిన గౌడ, బుడగ జంగాలు, మున్నూరు కాపు, రెడ్డి సంఘాల నాయకులు, సభ్యులు ఉప సర్పంచ్ నల్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది, జమ్మికుంట పదో వార్డు కౌన్సిలర్ మల్లన్న ఆధ్వర్యంలో వంద మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
కల్యాణలక్ష్మి దండుగనట..
తల్లిదండ్రులకు ఆడబిడ్డలు బరువు కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెడితే ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. అయితే, మొన్నామధ్యన ఓ మీటింగ్లో ఈటల రాజేందర్.. కల్యాణలక్ష్మి దండుగా, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు పరిగె ఏరుకున్నట్లు అని ప్రసంగించారని.. కల్యాణలక్ష్మి పథకాన్ని ఉంచాలా? వద్దా? అని ఆయన మహిళలను ప్రశ్నించారు. ఒకవేళ ఉండాలని భావిస్తే చేతులు ఎత్తాలని కోరగా సభలోని వారంతా చేతులు ఎత్తి కల్యాణ లక్ష్మిని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.