హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కారు డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, అతనికి నిర్లక్ష్యాన్ని ఆపాదించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. డ్రైవింగ్ నిర్లక్ష్యానికి అతను ఎలా కారణమవుతాడని ప్రశ్నించింది. ఈ ప్రమాదంలో మృతుడికి నిర్లక్ష్యాన్ని ఆపాదిస్తూ అతని కుటుంబానికి పరిహారాన్ని తగ్గించడంచెల్లదని తేల్చిచెప్పింది. మృతుడి కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాల్సిందేనని న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా సంస్థను ఆదేశించింది. 2013లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన తనకు ప్రమాద బీమా పరిహారాన్ని తగ్గిస్తూ మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదంటూ మెదక్కు చెందిన ఏ సత్యవతి, మరొకరు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. మృతుడి కుటుంబానికి చెల్లించాల్సిన రూ.29 లక్షల పరిహారంలో ఇప్పటికే కొంత చెల్లించినట్టయితే మిగిలిన మొత్తాన్ని పదేండ్ల వడ్డీ తో కలిపి చెల్లించాలని బీమా సంస్థకు ఉత్తర్వులు జారీచేసింది.