హైదరాబాద్: కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓవర్ స్పీడ్లో ఉందని తెలిపారు. ప్రమాదం తరువాత వంద స్పీడ్ వద్ద స్పీడో మీటర్ ఆగిపోయిందని చెప్పారు. కారు బ్యానెట్పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు ఉండటంతో.. రెడీమిక్స్ వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి ఓఆర్ఆర్ రెయిలింగ్కు బలంగా తాకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయిందని తెలిపారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
కాగా, ప్రమాదం అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవర్తోపాటు లాస్య నందితను పటాన్చెరూలోని అమేధా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన హాస్పిటల్కు వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. నదిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించడంతో.. అంబులెన్స్తోపాటు అక్కడికి వెళ్లారు.