సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానికి లేదా? తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? అని మోడీ సర్కారును మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతిగింజనూ కొనుగోలుచేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోల్ల శ్రీనివాస్, దేవిప్రసాద్తో కలిసి సంగారెడ్డిలో గురువారం నిర్వహించిన నిరసనదీక్షలో తలసాని పాల్గొన్నారు.
తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా ఎదిగిందన్నారు. కానీ, తెలంగాణలో పండిన వడ్లు కొనకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు.
తమ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి గోయల్ను కోరితే, అవమానించిపంపారని మంత్రి శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని హేళనగా మాట్లాడారన్నారు. తెలంగాణ రైతులంతా కలిసి బీజేపీ నాయకులకు నూకలు తినే పరిస్థితి తీసుకొస్తామన్నారు. ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమి భయంతోనే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారని బీజేపీని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు కన్నెర్రజేస్తే ఢిల్లీలో బీజేపీ సర్కారు గద్దె దిగుతుందని హెచ్చరించారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన గవర్నర్ను అడ్డుపెట్టుకొని మోడీ సర్కారు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనేదాకా తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీలో దీక్ష చేసి, తెలంగాణ రైతుల సత్తా చూపిస్తామన్నారు. బీజేపీపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహిపాల్రెడ్డి సూచించారు.
ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ, తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వరి సాగు చేయించింది బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పారు. ఇప్పుడు ధాన్యం కొనబోమని కేంద్రం చెబుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులపట్ల కేంద్ర సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలోని రైతులందరూ శుక్రవారం నల్ల జెండాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. తెలంగాణ వడ్లు కొనేదాకా రైతుల తరఫున పోరాడతామన్నారు.