హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశ పరిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి లాభం చేకూర్చే విధంగా లేదన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలు సహా ఉద్యోగ, కార్మిక వర్గాలకు కేంద్ర బడ్జెట్ మొండి చేయి చూపిందని వినోద్ కుమార్ అన్నారు.
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆర్బ్రిట్రేషన్ సెంటర్, వరల్డ్ క్లాస్ ఫారెన్ ఇనిస్టిట్యూట్ లను గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్నికల్ ( GIFT ) సిటీ లో స్థాపించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించారని వినోద్ కుమార్ అన్నారు.
ప్రతిష్టాత్మక సంస్థలను గుజరాత్ రాష్ట్రానికి తరలించడం దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షతను చూపుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన ఆరోపించారు.
జాతీయ హోదా ఇచ్చే ప్రక్రియ ఏదీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుత బడ్జెట్ లో బుందేల్ ఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి దాదాపు రూ. 49 వేల కోట్లు కేటాయింపులు జరిపిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ లో బుందేల్ ఖండ్ కు ప్రత్యేక హోదా కల్పించారని ఆయన ఆరోపించారు.
వందే భారత్ కింద ప్రవేశపెట్టనున్న కోచ్ లలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.