దండు మల్కాపూర్/ఆర్మూర్ : దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, దండుమల్కాపూర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని దండు మల్కాపూర్ లో మంత్రి జగదీష్ రెడ్డి, అభ్యర్థి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ దండుమల్కాపూర్ గ్రామాన్ని నూటికి నూరుశాతం అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానని, ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని మైసమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. డబ్బు సంపాదన తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకోని ఒక కాంట్రాక్టర్ కు, నిత్యం ప్రజల మధ్యే ఉండే క్యారెక్టర్ ఉన్న నేతకు మధ్య జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు.
రాజగోపాల్ రెడ్డి 18వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాడని విమర్శించారు. దండుమల్కాపూర్ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని పేర్కొన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదంటే మంత్రి జగదీశ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో మాట్లాడి గ్రామానికి బస్సులు వేయించానని అన్నారు. ప్రభాకర్రెడ్డి 50వేల మెజారిటీ తో గెలుపు ఖాయమన్నారు.
సకల జనులంతా సారు, కారు, కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. తెలంగాణను ఆగం చేసే కుట్రతో బయలు దేరిన బీజేపీ రాకాసి మూకలను తెలంగాణ పొలిమేరలు దాటేవరకు తరిమికొట్టడానికి ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.