హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్పై.. బీజేపీలోని పాత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈటల వ్యవహారశైలి బీజేపీ నేతలకు ఎంతమాత్రం మింగుడుపడటంలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పోటీ చేస్తున్నట్టుగా లేదని, ఈటల కోసం బీజేపీ పనిచేస్తున్నట్టుగా ఉన్నదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈటల బీజేపీని వాడుకొంటూ తన వ్యక్తిగత ప్రచారం చేసుకొంటున్నారే తప్ప పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈటల పూర్తిగా సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడంకోసమే కమలం గుర్తును వాడుకొంటున్నారని ఆరోపిస్తున్నారు. ‘బీజేపీలో చేరి ఇన్ని రోజులైనప్పటికి కూడా ఈటల జై శ్రీరాం అనలేదు. తన అనుచరులతో అనిపించలేదు. పైగా మేం జై శ్రీరాం అంటే ఆయనకు ఇరిటేషన్ వస్తున్నది. హిందుత్వంలోనే పుట్టి పెరిగిన మాకు ఈటల పక్కన నిలబడాలంటేనే సిగ్గుచేటుగా ఉన్నది’ అని స్థానిక బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల్లో ఈటల పట్ల వ్యక్తమవుతున్న అసంతృప్తికి ఇదొక ఉదాహరణ మాత్రమే.