ప్రపంచంలో ఎకడి నుంచైనా హైదరాబాద్కు రావడానికి మెరుగైన రవాణా మార్గాలున్నాయి. ఇక్కడి వాతావరణం, వసతి సౌకర్యాలు, ఆహారం.. ఇవన్నీ దేశ విదేశాల నుంచి వచ్చేవారిని ఆకట్టుకొనేలా ఉంటాయి. హైదరాబాద్కు గొప్ప విశిష్టతలు ఉన్నాయి. నగర వాతావరణం ఎంతో అనువుగా ఉంటుంది. సాంస్కృతికంగా కూడా హైదరాబాద్ అన్ని దేశాలవారికి అనువుగా ఉన్నది. వీటికితోడు విదేశీ కరెన్సీ మారక కోణంలో చూసినా మనదేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభమైతే ఎక్కడి నుంచి వచ్చేవారికైనా ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. – జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి చేరనున్నది. పారిశ్రామిక వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (మధ్యవర్తిత్వ కేంద్రం) ఏర్పాటు ప్రక్రియను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ప్రారంభించారు. మధ్యవర్తిత్వ కేంద్ర ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా తొలి సంతకం చేశారు. బంజారాహిల్స్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసంలో జరిగిన కా ర్యక్రమంలో ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కరతాళ ధ్వనుల మధ్య సీజేఐ ప్రారంభించారు. హైదరాబాద్కు ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్లో మధ్యవర్తిత్వ కేంద్రం స్థాపన పనులు వేగంగా జరుగటంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సహకారం మరువలేనిదని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. జూన్లో తాను సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కేంద్రాన్ని నగరంలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించగానే సీఎం కేసీఆర్ తక్షణం సానుకూలంగా స్పందించారని తెలిపారు. అదే నెల 30న మధ్యవర్తిత్వ కేంద్రం కోసం లేఖ రాయటమే కా కుండా సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో ఐటీ శా ఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఆర్థికశాఖ ము ఖ్యకార్యదర్శితో కూడిన బృందాన్ని ఢిల్లీకి పంపారని గుర్తుచేశారు. మూడు నెలల్లోనే ఆర్బిట్రేషన్ సెంటర్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావటంతో తన కల సాకారం అవుతున్నదని ఆనందం వ్యక్తంచేశారు. ఇది హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రక దినమని పేర్కొన్నా రు. మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్కు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని, అభివృద్ధికి హైదరాబాద్ చిరునామాగా మారిపోతుందని చెప్పారు. మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు 2003లో షామీర్పేటలోని నల్సార్ వర్సిటీ సమీపంలో నాటి ప్రభుత్వం కేటాయించిన పదెకరాలు ఇప్పటికీ హైకోర్టు వద్దనే ఉన్నదని, దానిని ప్రభుత్వం తీసుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భూమి కేటాయిస్తే సెంటర్ ఏర్పాటు వేగవంతం అవుతుందని మంత్రి కేటీఆర్ దృష్టికి సీజేఐ తీసుకెళ్లారు.
సమర్థ పాలన, నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులతో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని జస్టిస్ రమణ తెలిపారు. ఉభయపక్షాల రాజీ తర్వాత మళ్లీ వివాదం తలెత్తకుండా చూసే అనుభవజ్ఞులైన ఆర్బిట్రేటర్స్ ఇం దులో ఉంటారని చెప్పారు. మధ్యవర్తిత్వ రంగం లో విశేష సేవలందించిన జస్టిస్ రవీంద్రన్, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సెంటర్ను ట్రస్టీలుగా పర్యవేక్షిస్తారని ప్రకటించారు. కేంద్రం ఏర్పాటుకు సంపూర్ణంగా సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మం త్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, జస్టిస్ రాజేంద్రన్, జస్టిస్ నాగేశ్వరావుకు సీజేఐ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాక 1996లో ఆర్బిట్రేషన్ చట్టాన్ని రూపొందించారని గుర్తుచేశారు. 2015లో న్యాయమూర్తుల బృం దంతో తాను జపాన్, కొరియా వెళ్లినప్పుడు ప్రతి సమావేశంలోనూ భారత్లో పెట్టుబడులు పెట్టిన త ర్వాత ఏదైనా వివాదం ఏర్పడితే ఎం తకాలంలో కేసులు రాజీ అవుతాయనే ప్రశ్నే అడిగారని గుర్తుచేశారు. సత్వరమే వివాదాలు పరిషారం కావాలంటే ఆర్బిట్రేషన్ ఉద్యమాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చా రు. ఇప్పటిదాకా మనదేశం నుంచి వివాదాల పరిష్కారానికి ఎకువగా సింగపూర్, దుబాయ్లోని ఆర్బిట్రేషన్ సెంటర్స్కు వెళ్తున్నారని, హైదరాబాద్లో ఆ కేంద్రం ఏర్పాటైతే విదేశీయులు కూడా ఇక్కడికే వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడి హోదాలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంతకంచేశారు. ట్రస్ట్ జీవితకాల సభ్యులుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, ట్రస్ట్ ట్రస్టీలుగా హైకోర్టు సీజే హోదాలో జస్టిస్ హిమాకోహ్లీ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హోదాలో ఏ ఇంద్రకరణ్రెడ్డి, సాక్షులుగా ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో జయేశ్రంజన్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ హోదాలో ఏ వెంకటేశ్వర్రెడ్డి కూడా సంతకాలు చేశారు. ఈ పదవుల్లో భవిష్యత్తులో ఎవరుంటే వారే ట్రస్టులో కూడా ఆ హోదాల్లో కొనసాగుతారు.
మధ్యవర్తిత్వ కేంద్రం స్థాపనకు హైదరాబాద్ నగరం అత్యంత అనుకూలమైనదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. 201920 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి 22 బిలియన్ డాలర్ల విలువైన వస్తుసేవలు ఎగుమతి అయ్యాయని, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 120 బిలియన్ డాలర్లుగా ఉన్నదని వివరించారు. ఆర్థిక వృద్ధి 12 శాతం ఉండటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో ఎకడి నుంచైనా హైదరాబాద్కు రావడానికి మెరుగైన రవాణా మార్గాలున్నాయి. ఇక్కడి వాతావరణం, వసతి సౌకర్యాలు, ఆహారం.. ఇవన్నీ దేశ విదేశాల నుంచి వచ్చేవారిని ఆకట్టుకునేలా ఉంటాయి. హైదరాబాద్కు గొప్ప విశిష్టతలు ఉన్నాయి. నగర వాతావరణ ఎంతో అనువుగా ఉంటుంది. సాంస్కృతికంగా కూడా హైదరాబాద్ అన్ని దేశాలవారికి అనువుగా ఉన్నది. వీటికితోడు విదేశీ కరెన్సీ మారక కోణంలో చూసినా మనదేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభమైతే ఎక్కడి నుంచి వచ్చేవారికైనా ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. హైదరాబాద్లో పెట్టుబడులే కాకుండా వాణిజ్య, వ్యాపారాలు కూడా పెరుగుతాయి’ అని జస్టిస్ రమణ వెల్లడించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథరావు, తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకునే విధానం కొత్తదేమీ కాదని సీజేఐ జస్టిస్ రమణ తెలిపారు. భారతీయ కుటుంబ వ్యవస్థలోనే ఇది ఇమిడి ఉన్నదని వివరించారు. అన్నదమ్ములు, స్నేహితులు, కుటుంబసభ్యుల్లో తలెత్తే వివాదాలను ఉభయపక్షాలు రాజీ చేసుకొనేదే ఇప్పుడు న్యాయవ్యవస్థలో చట్టబద్ధంగా అమలవుతున్నదని పేర్కొన్నారు.
ఆర్బిట్రేషన్స్కోసం దేశం నుంచి చాలామంది సింగపూర్కు వెళ్తుంటారు. హైదరాబాద్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం కొత్త అధ్యాయం. సత్వర న్యాయం జరుగుతుంది. జాప్యం లేకుండా తకువ ఖర్చుతో ఫలితాలు ఉంటాయి. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్న సీజేఐ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడం హర్షణీయం. – జస్టిస్ లావు నాగేశ్వరరావు
మధ్యవర్తిత్వ కేంద్రం తెలంగాణకు వరంగా మారుతుంది. హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటు ఆలోచన గొప్ప విషయం. దానిని సీజేఐ ఆచరణలో పెట్టేందుకు చూపిన చొరవ హర్షణీయం. తెలంగాణకే కాదు ఏపీకి కూడా ఇదొక అదృష్టం. జస్టిస్ రవీంద్రన్ సేవలు అందుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. – జస్టిస్ సుభాష్రెడ్డి
ముగ్గురు తెలుగువారు సుప్రీంకోర్టులో కొలువుదీరిన వేళ హైదరాబాద్కు ఈ మహత్తర అవకాశం లభించడం నిజంగా తెలంగాణకే గర్వకారణం. దేశంలో ఎకడైనా వివాదాలు వచ్చినప్పుడు సత్వరమే పరిషారం కాకపోతే పెట్టుబడులు వెనక్కి పోయే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్లో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించిన సీజేఐ జస్టిస్ రమణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే సెంటర్ను ఏర్పాటుచేయాలి. దానిని జస్టిస్ ఎన్వీ రమణే ప్రారంభించాలని కోరుకొంటున్నాను. ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుంది.
– మంత్రి కేటీఆర్