హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ల రూపేణా దేశంలో భారీ మోసాలకు పాల్పడుతున్న చైనా సైబర్ చీటర్లు తమ నేరాలకు ప్రధానంగా విదేశీయులనే నియమించుకొంటున్నారు. బ్యాకెండ్లో సాఫ్ట్వేర్ను తయారు చేయించేందుకు, నెట్వర్క్ను నిర్వహించేందుకు విదేశీయులనే ఉపయోగించుకొంటున్నారు. వారికి సాధారణ స్థాయి కంటే రెట్టింపు జీతాలు చెల్లిస్తున్నారు. జనాన్ని నిలువునా ముంచి అధిక మొత్తాల్లో డబ్బు జమ చేయిస్తున్నవారికి ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. ఇదంతా చైనా నుంచే జరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెట్టుబడుల పేరుతో దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను మోసగించిన రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మనీ ఎక్సేంజీని అడ్డాగా చేసుకొని రంజన్ మనీ కార్ప్ అక్రమంగా హవాలా మార్గం ద్వారా రూ.903 కోట్లు దేశం దాటించినట్టు దర్యాప్తులో తేలడంతో ఓ చైనీయుడు, మరో తైవాన్ జాతీయుడు సహా మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ఇలాంటి మోసగాళ్లు ప్రధానంగా పెట్టుబడి దారులను ఆకర్షిస్తారు.
ఆ తర్వాత వారిని బుట్టలో వేసుకొని బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయిస్తారు. ఈ తతంగమంతా గూగుల్ ప్లేస్టోల్లోని యాప్ల ద్వారా కాకుండా కేవలం లింకుల ద్వారానే జరిపిస్తారు. ఆ లింకుల ద్వారానే సైబర్ నేరగాళ్ల యాప్లన్నీ డౌన్లోడ్ అవుతుంటాయి. ఈ యాప్లకు ఎప్పటికప్పుడు కొత్త యూఆర్ఎల్ (యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్)ను తయారు చేసి, యాప్ స్కెలిటన్ను అలాగే ఉంచుతూ ఫ్రంట్ పేజీలో మాత్రమే మార్పు చేస్తున్నారు. ఈ ముఠాలో పనిచేస్తున్న వారిలో ఒకడు అమాయకులకు మేసేజ్లు పంపడంలో నేర్పరి అయితే.. మరొకడు చాటింగ్ ద్వారా అవతలి వాళ్లను బుట్టలో పడేసి, డబ్బులు డిపాజిట్ చేయించడంలో నేర్పరి. అలా డిపాజిట్ అయిన డబ్బును ఇంకొకడు ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తాడు. ఈ ముఠాలన్నింటినీ చైనీయులే సమన్వయం చేస్తూ నేరాలను కొనసాగిస్తున్నారు.
కంబోడియా కేంద్రంగా..
తైవాన్కు చెందిన చువాన్ యునును గతంలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీ కార్యకలాపాల నిమిత్తం కంబోడియాకు వెళ్లివచ్చేవాడు. ఆ క్రమంలో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లతో పరిచయం ఏర్పడింది. చైనాలో ఉంటూ ఈ యాప్ల సహాయంతో స్కామ్ను నిర్వహిస్తున్న ఓ మహిళ చువాన్కు పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరికొందరుతో టచ్లోకి వచ్చింది. వారందరితో ఒకేసారి మాట్లాడింది. తాను చెప్పినట్టు చేయగలిగితే అందరికీ మంచి జీతాలతోపాటు నెలవారీగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తానంటూ నమ్మించి, అడ్వాన్స్గా ఒక్కొక్కరికి 5 వేల డాలర్లు పంపింది. పనిచేయకముందే డబ్బు చేతికి అందడంతో యాప్లను తయారు చేసేందుకు, బ్యాంకు ఖాతాలను నిర్వహించేందుకు చాలా మంది ముందుకొచ్చారు. వారికి ఆమె రెట్టింపు జీతాలు ఇస్తున్నది. వారు తయారు చేసిన గేమింగ్, లోన్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యాప్లు కంబోడియాలోని కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతున్నాయి. వాటి ద్వారా నిర్వాహకులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు.