హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల సంచలనం సృష్టించిన డాటా చోరీ కేసుపై సైబరాబాద్ పోలీసుల విచారణ వేగవంతమైంది. డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం.. నిందితులైన కుమార్ నితీశ్భూషన్, సుశీల్తోమర్, అతుల్ ప్రతీప్సింగ్, సందీప్పాల్, జియా ఉర్ రహమాన్ను రెండోరోజు విచారించింది. ప్రధానంగా యాక్సెస్, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల నుంచి డాటా బయటకు ఎలా వస్తుంది. డాటాను బల్క్లో విక్రయించడంతో పాటు ఆ డాటాతో ఇంకా ఏమి చేస్తున్నారనే అంశాలను విచారిస్తున్నారు.
నోయిడాలో కాల్ సెంటర్ నిర్వహించే నిందితులు ఒక్కొక్కరిని ఒక్కో అధికారి చొప్పున విచారించారు. ఎప్పటినుంచి ఈ డాటా చోరీకి పాల్పడుతున్నారు, ఎంతమందికి విక్రయించారనే విషయాలను రాబడుతున్నారు. వీరితో సంబంధాలున్న మరింత మంది వివరాలనూ పోలీసులు రాబట్టినట్టు తెలిసింది. డాటా చోరీ కేసు విషయంపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. డాటా చోరీ కేసులో బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ డాటాతో ఏ మేర చట్ట విరుద్ధంగా నడుచుకున్నారు, ఎలాంటి ప్రయోజనాలు పొందారనే అంశాలపై ప్రత్యేక బృందం విచారణ జరుపుతున్నది.