హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును అడ్డుకొనే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి చార్జిషీటు దాఖలు చేసేవరకు జోక్యం చేసుకొనే అవకాశం కోర్టులకు అరుదుగా ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేసిన వారికి రాజ్యాంగం ప్రకారం రక్షణ ఇవ్వకూడదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మంగళవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం, సిట్ తరఫున దవే వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన రాజ్యాంగం కల్పించిన మౌలిక అంశాలని, ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేసిన వాళ్లకు, అదే రాజ్యాంగంలోని 226 అధికరణం కింద ఉపశమనం కల్పించవద్దని కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సవాల్ చేస్తూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. నాలుగు గంటలకుపైగా ఈ ఒక కేసునే న్యాయమూర్తి విచారించారు. ఈ సందర్భంగా దవే మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు పూర్తికాకుండా అడ్డుకొనే అధికారం కోర్టులకు లేదని స్పష్టంచేశారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకొనే అధికారం కోర్టులకు ఉండదని సుప్రీంకోర్టు అరుణ్గోస్వామి కేసులో తీర్పు చెప్పిందని ఉదహరించారు.
వీగిపోయిన సీబీఐ దర్యాప్తు కేసులు
ఆయారాం.. గయారాం.. వ్యవస్థను రూపుమాపేందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చి శాసనసభ స్పీకర్లకు అధికారం ఇచ్చారని, కానీ ఆ తరువాత కూడా ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరుగుతూనే ఉన్నాయని దవే చెప్పారు. గుజరాత్లో 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందితే 19 మందిని బీజేపీ తనవైపు తిప్పుకున్నదని ఉదహరించారు. మహారాష్ట్రలో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి, వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని చెప్పారు. కర్ణాటక, గోవా వంటి రాష్ర్టాల్లో కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అక్కడి ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని తెలిపారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చని, వారు ప్రజా సేవకులేనని పార్లమెంట్ చట్టం కూడా చేసిందని గుర్తుచేశారు. ఇకడి కేసులో ఎమ్మెల్యేకు కోట్ల రూపాయలు ఎర చూపి బీజేపీలో చేర్చుకొనేందుకు నిందితులు చేసిన కుట్రను అన్ని కోణాల్లో బట్టబయలు చేయాలంటే సిట్ శాస్త్రీయంగా చేస్తున్న దర్యాప్తును అడ్డుకోరాదని కోరారు. సీబీఐ చేపట్టిన అనేక దర్యాప్తులు కోర్టుల్లో వీగిపోయాయని గుర్తుచేశారు. సిట్ లోతుగా సమగ్రంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నదని, అనేక కీలక ఆధారాలు సేకరించిందని తెలిపారు.
నిందితులే దర్యాప్తు సంస్థను ఎంచుకోలేరు
రాజ్యాంగంలోని 226 అధికరణం కింద రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దర్యాప్తు మార్పుపై ఉత్తర్వుల జారీకి ఆసారం ఉంటుందని దవే చెప్పారు. పిటిషనర్ అనుమానిస్తున్నట్టుగా నిజంగానే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నప్పటికీ క్రిమినల్ కేసు దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకునే హకు ఎవరికీ ఉండదని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఫలానా దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించాలని అభ్యర్థించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును బదిలీచేయాలని కోరే హకు నిందితులు, ఫిర్యాదుదారుడు, పిటిషనర్లకు ఎప్పటికీ ఉండదని స్పష్టంచేశారు. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసేవరకు నిందితులు వేచి ఉండాలని చెప్పారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదని చెప్తున్న బీజేపీ.. కేసు మీద కేసు వేస్తూ దర్యాప్తును అడ్డుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
సీఎంకు నోటీసులు అవసరం లేదు:ఏఏజీ
ఈ కేసుల్లో సత్వరమే విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. కాలయాపన చేయకుండా అందరూ సత్వర విచారణకు సహకరించాలని కోరారు. దీనిపై బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ తరఫు సీనియర్ న్యాయవాది హెగ్డే మాట్లాడుతూ.. తమ కేసులో సీఎం కేసీఆర్ను ప్రతివాదిగా చేర్చామని, ఆయనకు నోటీసులు జారీచేయాలని, సీఎం కూడా కౌంటర్ దాఖలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై అదనపు ఏజీ రామచందర్రావు స్పందిస్తూ.. సీఎంకు నోటీసు జారీచేయాలనే వాదనను వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
దవే కల్పించుకొని, సుప్రీంకోర్టుకు ముగ్గురు నిందితులు మాత్రమే వెళ్లారని, వాళ్ల కేసును మాత్రమే నాలుగు వారాల్లోగా హైకోర్టు పరిషరించాలని చెప్పిందని..అన్ని కేసులకూ ఆ ఉత్తర్వులు వర్తించవని చెప్పారు. ముగ్గురు నిందితుల కేసుల్లో విచారణ పూర్తిచేసి తుది ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అన్ని కేసులను విచారించి తీర్పు చెప్తామంటే బీజేపీ, దానికి మద్దతు చెప్పే వాళ్లు రోజుకు రెండు కేసులు చొప్పున దాఖలు చేసి కాలయాపన చేస్తారని చెప్పారు. బీజేపీ రిట్ పిటిషన్లను కొట్టేసి సిట్ దర్యాప్తునకు అవరోధాలు లేకుండా సమగ్ర దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ తరఫున కర్ణాటక మాజీ ఏజీ ఉదయ్హళ్లే వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.
ప్రాథమికదశలో అడ్డుకోరాదు
ఫిర్యాదుదారుడు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, సిట్ కేసును రద్దు చేయాలని కోరడం చట్టవ్యతిరేకమని ప్రకాశ్సింగ్ బాదల్పంజాబ్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని దవే గుర్తుచేశారు. ఏ కేసులోనైనా దర్యాప్తును ప్రాథమికదశలో అడ్డుకోవడం చెల్లదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని తెలిపారు. ఎమ్మెల్యేల ఎర కేసులో లంచంగా ఇస్తామన్న డబ్బు ఎకడా లభ్యం కానందున అవినీతి కిందకు రాదన్న వాదనననూ తోసిపుచ్చారు. లంచం ఇస్తామని ఎర వేయడం కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 120 కింద నేరమేనని తెలిపారు. ఈ కేసులో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు, వాట్సాప్ చాటింగ్స్ వంటి కీలక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలకు మాత్రమే చట్టప్రకారం హకులు ఉంటాయన్నారు. అది కూడా సిట్ చార్జిషీట్ వేసే వరకు వారు కూడా దర్యాప్తును ప్రశ్నించేందుకు ఆసారం లేదని దవే పేర్కొన్నారు.