హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. అగ్నిప్రమాదానికి సంబంధించి సోమవారం వరకూ క్రైమ్సీన్ను అంచనా వేసిన అధికారులు మంగళవారం నుంచి విచారణ ప్రారంభించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన సర్వర్ల నుంచి డాటాను రిట్రీవ్ చేసేందుకు సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నిపుణులు ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వారు వెంట తెచ్చుకున్న ప్రత్యేక కిట్తో.. సర్వర్ల నుంచి డాటా బ్యాకప్ను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు నాగ్పూర్లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజ్కు చెందిన చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ఫోరెన్సిక్ ఫైర్, సైబర్ ఇన్వెస్టిగేటర్ నీలేశ్ ఉకుందే తెలంగాణకు చేరుకుని దర్యాప్తులో నిమగ్నమయ్యారు. తన బృందంతో కలిసి ఎఫ్ఎస్ఎల్ లోపల కాలిపోయిన ఆధారాలను సేకరిస్తున్నారు. వారికి సాయంగా మన ఫైర్ అధికారులు సైతం అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
ఎఫ్ఎస్ఎల్ చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు చెప్తున్నట్టు కుట్ర కోణంలోనే సీఎఫ్ఎస్ఎల్, ఫైర్ ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజులైనా సరైన కారణం బయటికి రాకపోవడంతో లోతుగా ఆధారాలను విశ్లేషిస్తున్నారు. కుట్ర కోణంపైనే ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగులను లోతుగా విచారిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఉండొచ్చేనే విధంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ‘ఆ రోజు ఏం జరిగింది?’ అనేది తెలుసుకునేందుకు బయోమెట్రిక్ ద్వారా విధులకు హాజరైన సిబ్బంది నుంచి వివరాల సేకరిస్తున్నట్టు తెలిసింది. మంగళవారం 12 మంది ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేసినట్టు సమాచారం. కాగా, తమ దర్యాప్తులో కొన్ని ర్యాక్స్లో ఉన్న పేపర్ ఎవిడెన్స్లు పూర్తిగా తగలబడి పోయినట్టు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి ఆన్లైన్ డాటా ఎంతవరకు సర్వర్ నుంచి రిట్రీవ్ చేయగలరనే దానిపైనే ఎఫ్ఎస్ఎల్ అధికారులు నమ్మకాలు పెట్టుకున్నారు. ఒకవేళ ఆ డాటా బ్యాకప్ రిట్రీవ్ అవ్వకపోతే కొన్ని వేల కేసులకు సంబంధించి.. మళ్లీ దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సమాచారం.