హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జిల్లా కోర్టులు తెలుగులో తీర్పులను వెలువరించాల్సిన అవసరం ఉన్నదని, న్యాయ విద్యాబోధన కూడా తెలుగులో జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ అభిప్రాయపడ్డారు. ‘న్యాయ వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రధానోపన్యాసమిస్తూ.. తెలుగు లా కాలేజీలను ప్రారంభించడం కంటే ఆంగ్లంలోని విషయాలను తెలుగులో బోధించాలని, తెలుగులో చుదువుకునేలా న్యాయ విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఏజీ, వీసీలకు విజ్ఞప్తి చేశారు.
ఒకటి రెండు కాలేజీల్లో ప్రయోగాత్మకంగా న్యాయవిద్యను తెలుగులో బోధిస్తే జిల్లా కోర్టుల్లో తీర్పులు తెలుగులో వెలువడేందుకు ఆసారం ఉంటుందన్నారు. చట్టాల్లో ప్రయోగించే పదాలు చాలా జటిలంగా ఉండటం వల్లే ప్రజలు న్యాయ వ్యవస్థకు దూరమవుతున్నారని తెలిపారు.
దేశంలో వైవాహిక, ఆస్తి వివాదాలు సహా పలు రకాల కేసుల పరిష్కారానికి దశాబ్దాల సమయం పడుతున్నదని, తీర్పులు ఆలస్యమవడం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి కేసులను మధ్యవర్తిత్వ (మీడియేషన్) విధానంలో రాజీ చేసుకునేందుకు మార్గాలను అన్వేషించాలని కక్షిదారులకు సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రఘునాథ్, మల్లారెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్ ప్రసంగించారు.