కంఠేశ్వర్, జూలై 6: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ సూచించారు. ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తుపదార్థాల వైపు మళ్లకుండా తమ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో ‘మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా న్యాయమూర్తి సుజోయ్ పాల్ మాట్లాడారు.
విద్యార్థులు డ్రగ్స్కు అలవాటుపడి మానసిక కుంగుబాటుకు లోనవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీ, సమాచార విప్లవంతో విజ్ఞానపరమైన అనేక అంశాలు తెలుసుకునే వెసులుబాటు ఏర్పడిందని, అదే సమయంలో యువత పెడదోవ పట్టేందుకు కూడా కారణంగా నిలుస్తున్నదని అన్నారు.
నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో లక్ష్యం దిశగా సాగాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీసుధ మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్కు అలవాటు పడినట్టు గమనిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు తెలపాలని, దీన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాల నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ పాల్గొన్నారు.