మెట్పల్లి, జనవరి 8: పేగు తెంచుకొని పుట్టిన అన్నదమ్ములు మరణంలోనూ కలిసేపోయారు. తమ్ముడి మృతిని తట్టుకోలేని అన్న బోరున విలపిస్తూ శ్మశానంలోనే కుప్పకూలిపోయాడు. ఒకే రోజు కొడుకుల మరణంతో తల్లిదండ్రులకు తీరనిదుఃఖం మిగిలింది. ఆదివారం జరిగిన ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విషాదం నింపింది. బోగ నాగభూషణం దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు సచిన్ కోరుట్లలోని ఓ సహకార బ్యాంకు లో ప్రైవేట్ ఉద్యోగి. రెండో కొడుకు శ్రీనివాస్(32) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. శనివారం రాత్రి హైదరాబాద్లో శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు.
మృతదేహాన్ని మెట్పల్లికి తీసుకువచ్చారు. ఆదివారం మధ్యా హ్నం వెల్లుల్ల రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. తీవ్ర ఆవేదనకు గురైన సచిన్ బోరున విలపిస్తూ శ్మశానంలోనే కుప్పకూలాడు. బంధుమిత్రులు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. శ్మశానంలో తమ్ముడి చితి కాలుతుండగానే మరో వైపు అన్న మృతి చెందడం పలువురి హృదయాలను కలిచివేసింది. సాయంత్రం సచిన్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఎదిగిన ఇద్దరి కొడుకులు తమ కళ్లెదుటే కానరానిలోకాలకు పోవడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరుమన్నారు.