Pin Stanley |ఖైరతాబాద్, ఫిబ్రవరి 6: అంతర్జాతీయ డ్రగ్స్ కింగ్పిన్ స్టాన్లీ పోలీసులకు చిక్కాడు. గోవా కేంద్రంగా దేశ, విదేశాల్లో డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇవూలా ఉకోడా స్టాన్లీ (43)ని పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పంజాగుట్ట పోలీస్స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో బిజినెస్ వీసాపై భారత్కు వచ్చాడు. ముంబైలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాది తర్వాత గోవాలోని కండోలిమ్కు చేరుకుని మత్తు పదార్థాలను తెప్పించి పర్యాటకులకు విక్రయించడం మొదలు పెట్టాడు. 15 ఏండ్లుగా డ్రగ్స్ దందాను విస్తరించుకుంటూ వచ్చాడు.
ప్రస్తుతం అతడి వద్ద దేశ వ్యాప్తంగా 500 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా, ఏడుగురు హైదరాబాద్కు చెందిన వారున్నారు. నిరుడు స్టాన్లీ డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్న హనుమంత్ బాబుసో దివాకర్ అలియాస్ బాబా, అలియాస్ బాబును ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్న్యాబ్ బృందం అరెస్టు చేసింది. అతడి ద్వారా ఆరా తీయగా, స్టాన్లీ గుట్టు రట్టయ్యింది. నిందితుడి వద్ద రూ.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. 557 గ్రాముల కొకైన్, 309 గ్రాముల 902 ఎక్స్టాసి పిల్స్, 105 ఎల్ఎస్డీ బ్లాట్స్, 215 గ్రాముల చరస్, 21 గ్రాముల హెరాయిన్, ఏడు గ్రాముల అంపెథమైన్, 45 గ్రాముల ఓజీ, 190 గ్రాముల వీద్, ఎనిమిది సెల్ఫోన్లు, రూ.5.40 లక్షల నగదు ఉన్నాయి.