హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్లో ఏర్పాటుచేయడం వివాదాల సత్వర పరిష్కారం దిశగా తీసుకున్న కీలకమైన ముందడుగుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ దినోత్సవాన్ని శనివారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. జస్టిస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక (ఏడీఆర్)పట్ల నమ్మకాన్ని మరింత పెంపొందించే దిశగా హైదరాబాద్ ఐఏఎంసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్స్లో తగినంత మహిళల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఇందుకు అనేక ఇతర మార్గాలున్నాయని చెప్పారు.
తటస్థత అమలు చేయాలి: జస్టిస్ అరాధే
గతంలో అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇక్కడే పరిష్కరించుకోవచ్చని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు. కీలక సూత్రాలైన తటస్థత, సమర్థత, అమలు నుంచి వైదొలగరాదని సూచించారు. హైదరాబాద్ ఏఐఎంసీ ఆసియన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్తో, తెలంగాణ రెరా అవగాహన ఒప్పందం చేసుకున్నది. యూఏఈకి చెందిన న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఆర్వీ రవీంద్రన్ పాల్గొన్నారు.