మాదాపూర్, మే 13: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా కోదాడకు చెందిన మద్దెపు పూజ (16) మాదాపూర్ పర్వత్నగర్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేరింది. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో ఆమె హాస్టల్ గదిలో ఎవరూలేని సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
కళాశాలలు ప్రారంభం కాకముందే కార్పొరేట్ కళాశాలలు తమ స్వప్రయోజనాల కోసం విద్యార్థులను బలవంతంగా రప్పించి తరగతులు నిర్వహిస్తున్నాయని, దీంతో విద్యార్థులు మానసికంగా క్రుంగిపోయి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి ఆరోపించారు. ఆ విద్యార్థిని మూడురోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కలాశాల నిర్వాహకులు ఆమె తల్లితండ్రులకు సమాచారం అందించకుండా తరగతులు నిర్వహించడంతోనే మానసిక ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు.