Inter Colleges | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ కాలేజీల్లో సాయంత్రం తరగతులు నడపొద్దని, స్టడీ అవర్స్ రెండు గంటలే నిర్వహించాలని ఇంటర్బోర్డు సూచించింది. ఇటీవలికాలంలో పలు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక మార్గదర్శకాల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఎనిమిది మందితో కూడిన కమిటీ ఏర్పాటై, పటిష్ఠ మార్గదర్శకాలను రూపొందించింది. త్వరలోనే ఈ మార్గదర్శకాలను వెల్లడించనున్నారు.
ఇందులో ముఖ్యంగా.. ప్రైవేట్ కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే నడపాలని తెలిపింది. హాస్టల్ విద్యార్థులకు 8 గంటలు నిద్ర తప్పనిసరి అని సూచించింది. సాయంత్రం స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని, ఈ సమయాన్నంతా విద్యార్థులు ఆటవిడుపు కోసం కేటాయించాలని సూచించింది. రాత్రి భోజనం ముగిసిన తర్వాతే ప్రత్యేక తరగతులు, స్లిప్టెస్ట్లు వంటివి నిర్వహించాలని పేర్కొన్నది. ఉదయం వేళల్లో యోగా, ధ్యానం చేసేలా చూడాలని చెప్పింది. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి సైకాలజిస్ట్ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని ఇంటర్బోర్డు సూచించింది.