హాజరుకానున్న 9.07 లక్షల మంది
ఇంటర్ సెకండియర్లో ఇంప్రూవ్మెంట్
ఫస్టియర్ పేపర్లకు రాసుకునే అవకాశం
ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం
ఎక్కువ మార్కులే పరిగణనలోకి
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్లో ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశం కల్పించారు. దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఈ ఒక్క ఏడాదికేనని అధికారులు స్పష్టంచేశారు.
సాధారణంగా ఇంట ర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాత్రమే ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఏదైనా పరీక్ష రాస్తే, ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులనే లెక్కలోకి తీసుకొంటున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే అంతే. కానీ, ఈ సారి మాత్రం ఇంప్రూవ్మెంట్గా పరిగణించి, ఎక్కువ వచ్చిన మార్కులతో మెమోలు జారీచేస్తారు. గత ఏడాది జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35 శాతం మార్కులేసి పాస్చేశారు. సెకండియర్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్మెంట్ రాసుకొనే అవకాశమిస్తామని ప్రకటించిన అధికారులు.. దానిని ఇప్పుడు అమలుచేస్తున్నారు.
పబ్లిక్ పరీక్షలకు మొదటిసారి
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. కరోనాతో 2020, 2021 సంవత్సరాల్లో ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించలే దు. ప్రస్తుతం ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులంతా ఎస్సెస్సీ పరీక్షలు రాయకుండానే పైతరగతులకు ప్రమో ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో 70 శాతం సిలబస్ను అమలుచేయడమే కాకుండా అధికారులు ప్రశ్నల్లో చాయిస్ శాతాన్ని కూడా గణనీయంగా పెంచారు.
దివ్యాంగులకు అదనంగా గంట!
వికలాంగులకు ఇస్తున్న అరగంట అదనపు సమయాన్ని గంటకు పెంచే అవకాశాలున్నాయి. దివ్యాంగులకు ఇచ్చే అదనపు సమయాన్ని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ గతంలోనే గంటకు పెంచింది. గంట పరీక్ష సమయానికి 20 నిమిషాలకు తగ్గకుండా అదనపు సమయాన్ని ఇవ్వాలని, 3గంటల పరీక్షకు 60 నిమిషాల అదనపు సమయం ఇవ్వాలని మెమో జారీచేసింది. దీనిని పరిగణనలోకి తీసుకొని 3 గంటల ఇంటర్ పరీక్షకు గంట అదనపు సమయం ఇవ్వాలని పలువురు ఇంటర్బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.